ప్రజలను నిత్య చైతన్యవంతులనుచేసి, వారిని ధర్మాచరణము వైపు మళ్ళించడానికి ఆలయ నిర్మాణం ఒక గొప్ప ఆయుధంగా భావించి శ్రీభాష్యం విజయసారథి గారు 1986లో యజ్ఞవరాహ క్షేత్రాన్ని నిర్మించారు. వారు చేపట్టిన వైవిధ్యభరితమైన కార్యక్రమాలన్నింటికీ ఈ క్షేత్రం వేదికగా నిలిచింది. విజయసారథిగారి సంకల్పబలం గొప్పది. కనీవినీ ఎరుగని అనేక వైదిక కార్యక్రమాల నిర్వహణతో ఈ ప్రాంతంలో ఒక నూతన ఒరవడిని సృష్టించారు. సర్వ వైదికధర్మాలకూ సమాన ప్రాతినిధ్యం కల్పించారు. నేడు ఈ క్షేత్రం ఒక దివ్య దేశంగా పరిఢవిల్లడానికి వారు తమ అమూల్యమైన జీవితాన్ని వెచ్చించారు.
శ్రీభాష్యం వారి ఆధ్వర్యంలో రెండు పర్యాయాలు శ్రీమద్రామాయణ మహాక్రతువు, శ్రీ మహావిష్ణు యాగము, శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తర శతకుండయాగం, సంపూర్ణ చతుర్వేద స్వాహాకారం, భాగవత సప్తాహాలు, సారస్వతేష్టి, రక్షోఘ్నేష్టి, ప్రాజాపత్యేష్టి, రాష్ట్రీయ మహాక్రతువు మొదలైన అనేక విశేష కార్యక్రమాలు నిర్వహింపబడినవి. నూతన దేవాలయ నిర్మాణాలు, జీర్ణోద్ధరణలు, ప్రతిష్ఠలు, కోటి కుంకుమార్చనలు మొదలైన కార్యక్రమాలను అనేక సార్లు నిర్వహించారు.
వేదాలపైన, ఉపనిషత్తులపైన, ధర్మశాస్త్రాలపైన, దర్శనాలపైన, రామాయణ భారత భాగవతాది పురాణాలపైన సాధికారత కలిగిన పండితులచే అనేక గోష్టులు, ప్రసంగ పరంపరలను, కవి సమ్మేళనాలను, అవధానాలను, పండిత సత్కారాలను యజ్ఞవరాహ క్షేత్రం వేదికగా నిర్వహించారు. వైదిక ధర్మ వ్యాప్తికి చిన్న చిన్న పుస్తకాలను ప్రచురించి ఉచితంగా పంపిణీ చేశారు. వేద పండితుల సత్కారాలను, శాస్త్రీయ సంగీత కళాకారులనాహ్వానించి వారి ప్రదర్శనలనేర్పాటు చేయడంతో పాటు ఆయా కళాకారులను సముచితంగా గౌరవించి, బిరుదులతో గౌరవించారు.
యజ్ఞవరాహ క్షేత్రంలో ప్రతి రోజూ ఉదయం సుప్రభాతం, తోమాలసేవ, కుంకుమార్చన, వేదపారాయణం, అర్చనలు జరుగుతాయి. వార్షికముగా 24 ఉత్సవాలు జరుగుతాయి.

